న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారంతో ఓ రాజ్యాంగ సంక్షోభానికి తెరపడింది. కానీ మొత్తం మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందా, పతనమైందా? ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ–శివసేన ఉమ్మడిగా హిందూత్వ ఎజెండాపై పోటీ చేశాయి. మొత్తం రాష్ట్రంలోని 288 అసెంబ్లీ సీట్లకుగాను 160 సీట్లను ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా గెలుచుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 145 సీట్లు అవసరం కాగా, ఏకంగా 160 సీట్లను గెలుచుకున్నాయి. 152 సీట్లకు పోటీ చేయడం ద్వారా బీజేపీ 105 సీట్లను, అంటే 70 శాతం విజయాన్ని, 124 సీట్లకు పోటీ చేయడం ద్వారా 56 సీట్లను, అంటే 40 శాతం సీట్లను శివసేన గెలుచుకుంది.
అంతేకాకుండా ఈ రెండు పార్టీల కూటమి 42 శాతం ఓట్లను దక్కించుకున్నాయి. రెండు కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడిగా 32.6 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఏవిధంగా చూసినా రాష్ట్ర ఓటర్లు బీజేపీ–శివసేన పార్టీల సంకీర్ణానికి సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా ఈ రెండు పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి పీఠం విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా అలా జరగలేదు. ఒకప్పుడు శివసేనకు చిన్న భాగస్వామ్య పార్టీగా బీజేపీ పోటీ చేయగా, ఇప్పుడు బీజేపీకి చిన్న భాగస్వామ్య పార్టీగా శివసేన పోటీ చేసింది. అంటే బీజేపీ ప్రాబల్యం పెరిగిపోయి శివసేన ప్రభావం పడిపోయింది. ఈ దశలో తామే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా తిరిగి పార్టీకి పూర్వ వైభవం తేవాలని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే భావించి ఉంటారు. అందుకే పొత్తు పొసగలేదు.